Saturday, March 4, 2017

4వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే

రెండు తెలుగు రాష్ట్రాల్లో లింగనిష్పత్తి పెరిగింది. కేంద్రం ఇటీవల విడుదల చేసిన 4వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం ఏపీలో ప్రతి వెయ్యిమందికీ 1,020 మహిళలుండగా తెలంగాణలో 1,007 మంది ఉన్నారు. కానీ గత అయిదేళ్లకాలం సగటు చూస్తే తెలంగాణ రాష్ట్రంలో లింగ నిష్పత్తి ప్రకారం ప్రతి 1000 మంది మగ శిశువులకు 874 మంది ఆడ శిశువులు మాత్రమే ఉన్నారు. ఏపీలో ప్రతి 1000 మంది మగ శిశువులకు 914 మంది ఆడ శిశువులుండటం ఆందోళనకర పరిణామం. ఈసర్వేను తెలంగాణ రాష్ట్రంలో 2015 ఫిబ్రవరి 23 నుంచి మే 9 మధ్యకాలంలో నిర్వహించారు. ఇందులో భాగంగా 786 కుటుంబాలు, 7565 మంది మహిళలు, 1050 మంది పురుషుల నుంచి సమాచారం సేకరించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో 10265 కుటుంబాలు, 10428 మంది మహిళలు, 1398 మంది పురుషుల నుంచి సమాచారం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 2015 మే 6 నుంచి ఆగస్టు 4 మధ్యకాలంలో సర్వే చేశారు. పరిమితమైన నమూనాలతోనే నిర్వహించినందున గత కుటుంబ సర్వేలతో దీన్ని పోల్చి చూడలేమని పేర్కొంది.
ఇంకెన్నో ప్రత్యేకతలు... ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పులయ్యే వారికి సగటున జాతీయ స్థాయిలో రూ.3,198 ఖర్చవుతుంటే, ఇది ఏపీలో రూ.2,145, తెలంగాణలో రూ.4,079గా ఉంది. దేశీయంగా సగటున 38.7% కాన్పులు ఆసుపత్రుల్లో జరుగుతుంటే ఏపీలో సగటున 91%, తెలంగాణలో 91.5% అవుతున్నాయి.
దేశవ్యాప్తంగా సిజేరియన్‌ కాన్పులు దశాబ్దకాలంలో రెట్టింపయ్యాయి. 2005-06 నాటి సర్వే ప్రకారం ప్రభుత్వాసుపత్రుల్లో సిజేరియన్‌ కాన్పులశాతం 15.2%, ప్రైవేటు ఆసుపత్రుల్లో 27.7% ఉండగా తాజా ఈసంఖ్య 11.9, 40.9%కి చేరింది. తెలుగురాష్ట్రాల్లో ఈసంఖ్య జాతీయ సగటు కంటే అధికం. ఏపీలో ప్రైవేటు ఆసుపత్రుల్లో 57% కాన్పులు సిజేరియన్‌ ద్వారా అవుతుండగా తెలంగాణలో ఇది 74.9%మేర ఉంది.
శిశుమరణాలు గత పదేళ్లలో తగ్గాయి. ప్రతి వెయ్యి మందికి ఏడాదిలో గతంలో 57మంది చనిపోతుండగా 41కి తగ్గింది. ఈసంఖ్య కేరళలో 6గా ఉంది. ఏపీలో 40, తెలంగాణలో 35మేర శిశుమరణాలు ఉన్నాయి.
అక్షరాస్యత, బాల్యవివాహాల విషయంలో కేరళ మిగతా రాష్ట్రాలకంటే మిన్నగా ఉంది. అక్కడ 99.9% కాన్పులు ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయి. సిజేరియన్‌ కాన్పులసంఖ్య జాతీయసగటుకంటే తక్కువే. కేరళలో లింగనిష్పత్తి తగ్గుతోంది. 2005-06లో ప్రతి వెయ్యిమంది పురుషులకు అక్కడ 1,124 మంది మహిళలుండగా తాజా సర్వేలో ఆ సంఖ్య 1,049కి తగ్గిపోయింది.
జాతీయ స్థాయిలో ఇలా.. 
గడిచిన దశాబ్దకాలంలో జాతీయస్థాయిలో కొన్నిరంగాల్లో మంచి పరిణామాలే సంభవించినట్లు సర్వేలో వెల్లడింది. దేశవ్యాప్తంగా పాఠశాలలకు వెళ్లే ఆరేళ్లలోపు పిల్లలసంఖ్య పదిశాతానికిపైగా పెరిగింది. అయిదేళ్లలోపు పిల్లల నమోదుసంఖ్య 40% వృద్ధిచెందింది. 20% అధిక ఇళ్లకు విద్యుత్తు సౌకర్యం సమకూరింది. రక్షితనీరు అందుబాటు విషయంలో మార్పేమీ కనిపించలేదు. గృహ మరుగుదొడ్ల సౌకర్యం మాత్రం 20% వృద్ధి నమోదైంది. ఆరోగ్యబీమా పరిధిలోకి వచ్చిన వారిసంఖ్య 24% పెరిగింది. ఇదే సమయంలో బాల్యవివాహాలు బాలికల్లో 20%, బాలురలో 12% మేర తగ్గాయి. మహిళల్లో సగటు గర్భధారణ తగ్గిపోయింది. 2005-06లో దేశంలో సగటున ఒక్కోమహిళ 2.7మంది పిల్లలకు జన్మనివ్వగా ఇప్పుడు అది 2.2కి పడిపోయింది. సర్వే సమయంలో ఇదివరకు 15-19 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళల్లో 16% మంది గర్భవతులుండగా, తాజా సర్వేలో 7.9%కి తగ్గింది. మహిళా కు.ని.ఆపరేషన్లు 1.3%మేర, మగవారిలో 0.7%మేర తగ్గాయి. సంస్థాగత కాన్పులు పెరిగాయి. మాతృ, శిశు ఆరోగ్యసంరక్షణలో సానుకూల సంకేతాలు కనిపించాయి.
స్థూలకాయులు పెరిగారు: గత పదేళ్లలో మహిళలు, పురుషుల్లో స్థూలకాయుల సంఖ్య 8% పెరిగింది. చక్కెరవ్యాధి సమస్య పురుషుల్లోనే ఎక్కువగా నమోదైంది. 15-49 ఏళ్ల మధ్యవయస్సుల్లోని మహిళల్లో 22.3% మహిళలు సెర్విక్‌, 9.8% మంది రొమ్ము, 12.4% మంది నోటిసంబంధ సమస్యలతో బాధపడుతున్నారు.

No comments:

Post a Comment